కర్ణుడు దూర్వాస వర ప్రభావాన కుంతీదేవికి సూర్యుని అనుగ్రహముతో జన్మించారు. అర్జునుని మీద అసూయతో తానూ అతని మించిన విలుకాణ్ణి కావాల్ని తలపోసాడు. ఒకరిని మించిన వారిని కావాలనుకోవడం తప్పేమీ కాదు.. కానీ ఈ పోటీలో కర్ణుని అసూయానలం ఆతన్ని అణువణువునా కాల్చి వేసింది. హస్తినలో నామాత్రముగా కౌరవ రాజ పుత్రులకు మాత్రమే జరుగుతున్న అస్త్ర పరీక్ష నాడు తగుదునమ్మా అంటూ వెళ్ళి భంగ పడ్డ అభాగ్యుడు కర్ణుడు.. కర్ణునికి ఆ క్షణములో యుక్తాయుక్త విచక్షణ లేదు . తనకు జరిగిన అవమానానికి ప్రతీకారేచ్చతో రగిలిపోతుంటే దానిని ఆసరాగా తీసుకుని దుర్యోధనుడుఆతన్ని తనవైపు మలచుకున్నాడు. వారిద్దరిదీ అవసరం. మిత్రత్వం కాదు. మంచి మిత్రులు ఎపుడూ తన ప్రాణాధికంగా ప్రేమిస్తున్న మిత్రుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఆతని మేలుకోరి వాటిని ఆపు జేయగలగాలి.. అదే నిజమైన మిత్రత్వము. మిత్రునిలోని మంచిని పెంచి, ఆతనిలోని చెడుని పెరగనివ్వకుండా జాగ్రత్తలు చెప్పి సహాయం చేయాలి. కానీ కర్ణుడు అటువంటి పని చేసినట్టు ఎక్కడా మనకు కనబడదు. దుర్యోధనుడు చేయ సంకల్పించిన ప్రతి దుష్ట కార్యానికి తగు సహాయం చేసాడు. చివరకూ ఇద్దరూ యుద్ధములో మరణం పాలయ్యారు.మంచి మిత్రులు ఎపుడూ తమ మిత్రులను వెన్నంటి కాచి వారికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడతారు. కర్ణ దుర్యోధనులది కేవలం అవసరం. నిజమైన స్వార్థ రహిత మిత్రత్వం కానే కాదు,శత్రువు శత్రువు మిత్రుడు అన్న చందం వారిద్దరిదీ .. అందుకే అసూయానలములో తాము ఆహుతి కావడమే కాక ఇతరులనూ ఆహుతి చేసారీ మిత్రద్వయం.
Comments
Post a Comment